గత కొద్ది రోజులుగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బరువును ప్రస్తుతం ఉన్న 14.2 కిలోల నుండి 10 కిలోలకు తగ్గించనున్నట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని, దానిని అధిగమించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. పాత సిలిండర్లలోనే తక్కువ పరిమాణంలో గ్యాస్ నింపి సరఫరా చేయడం ద్వారా ఎక్కువ మందికి కనెక్షన్లు అందించవచ్చని కంపెనీలు భావిస్తున్నట్లు కథనాలు వెలువడటంతో సామాన్య వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.
ఈ పరిణామాలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ, ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. సిలిండర్ల బరువును తగ్గించే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని, ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు. ఏవైనా మార్పులు ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని, ప్రస్తుతానికి పంపిణీ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఆమె వివరణ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది.
సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి 14.2 కిలోల సిలిండర్ సుమారు 35 నుండి 40 రోజుల వరకు వస్తుంది. ఒకవేళ దీనిని 10 కిలోలకు తగ్గిస్తే నెల రోజుల లోపే గ్యాస్ అయిపోతుందని, తద్వారా రీఫిల్లింగ్ ఖర్చులు మరియు బుకింగ్ ఇబ్బందులు పెరుగుతాయని ప్రజలు భావించారు. అయితే కేంద్రం ఇచ్చిన తాజా స్పష్టతతో పాత పద్ధతిలోనే 14.2 కిలోల సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగనుంది. వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు భరోసా ఇచ్చారు.
