Union Budget 2024 : పార్లమెంటు బడ్జెట్ సెషన్ ఈనెల 22న ప్రారంభం కానుంది. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 12 వరకు కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈవివరాలను ఇవాళ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే సర్కారు ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మోడీ మూడోవిడత పాలనలో ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్(Union Budget 2024) ఇదే కావడం గమనార్హం. ఈదఫా బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ వరసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు అంతకు మించిన రికార్డు నిర్మలా సీతారామన్ సొంతమవుతోంది. బడ్జెట్ను ప్రవేశపెట్టే విషయంలో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. సూట్కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే ట్రెండ్ను ఆమె మొదలుపెట్టారు.
Also Read :24 Lakh Affected: వరదలతో వణుకు.. 24 లక్షల మందిపై ఎఫెక్ట్
ఈ బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు తీపి కబురు వినిపించే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు), సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) ప్రతి ఏటా చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ. 50,000 , 60 ఏళ్లలోపు వారికి రూ. 25,000 వార్షిక పన్ను మినహాయింపు లభిస్తోంది. ఈ పరిమితిని పెంచాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. ఈ దిశగా బడ్జెట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ యోజనలో భాగంగా 70 ఏళ్లు పైబడిన భారత సీనియర్ సిటిజన్లకు కీలకమైన, ఉచిత ఆరోగ్య సంరక్షణ సపోర్టును అందించనునట్లు సమాచారం.ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ 18% ఉంది. దీంతో సీనియర్ సిటిజన్లు బీమా కవరేజీని పొందడానికి గణనీయంగా ఎక్కువ ప్రీమియంలను చెల్లించాల్సి వస్తోంది.ఆ సమస్య ఇకపై ఉండకుండా కొత్త బడ్జెట్లో నిర్ణయం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.