ఉత్తరప్రదేశ్ (uttarpradesh) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ జిల్లా (Ghazipur District) లో నవ వధువు ఇచ్చిన షాక్కు వరుడుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులకు దిమ్మతిరిగిపోయింది. ఊహించని ఘటన చోటు చేసుకోవటంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. శివశంకర్ అనే వ్యక్తికి రంజన అనే యువతితో ఈనెల 11న వివాహం జరిగింది. అయితే, వీరి వివాహాన్నిఆరు నెలల కిందటే పెద్దలు కుదుర్చారు. పెండ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులుసైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లి ముగిసిన అనంతరం వధూవరులతో పాటు ఇరు కుటుంబాల వారు వరుడి ఇంటికి వెళ్లారు. మరుసటిరోజు ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులుసైతం హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం కుటుంబ సభ్యులు కొందరు ఒకేచోట కూర్చొని ముచ్చటిస్తున్నారు. వీరి వద్దకు వధూవరులుకూడా వెళ్లారు. ఈ క్రమంలో వధువు చెల్లెలు బావను ఆటపట్టించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగింది. అయితే, మన దేశ ప్రధాని ఎవరు అని ప్రశ్నించింది. వరుడు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అక్కడి వారు వరుడ్ని చూసి ఎగతాళిగా నవ్వారు. నవవధువు రంజనకు కోపం వచ్చింది. ప్రధాని పేరుకూడా తెలియని నీతో కాపురం చేయనని తాళిబొట్టును తీసేసింది.
అక్కడే ఉన్నఇరు కుటుంబాల సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వధువును వారించే ప్రయత్నం చేసినా ఆమె పట్టించుకోలేదు. వెంటనే వధువు మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వరుడు శివశంకర్ తమ్ముడు అనంత్ను పెళ్లి చేసుకుంది. అక్కడే తాళిబొట్టు కట్టించుకుంది. రంజన చేసిన పనికి అందరికి దిమ్మతిరిగిపోయింది. కొందరు వారించే ప్రయత్నం చేసినా రంజన వినిపించుకోలేదు. అయితే, రంజన కంటే అనంత్ వయస్సు తక్కువ. ఈ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.