Robert Vadra : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా బీజేపీపై ఫైర్ అయ్యారు. సరిగ్గా హర్యానా అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్లు జైలు నుంచి విడుదలవడం వెనుక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలను దెబ్బతీసే కుట్రతోనే వారిద్దరిని బీజేపీ విడుదల చేయించిందని రాబర్ట్ వాద్రా(Robert Vadra) పేర్కొన్నారు.
Also Read :India Vs China : భారత్పై చైనా ‘గ్రే జోన్’ యుద్ధ వ్యూహాలు : భారత ఆర్మీ చీఫ్
‘‘గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణల కేసులో గుర్మీత్కు సీబీఐ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఆయన జైలుకు వెళ్లారు. అలాంటి వ్యక్తికి హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని రోజుల ముందు 20 రోజుల పెరోల్ రావడం ఆశ్చర్యకరం. ఇది కచ్చితంగా బీజేపీ పనే’’ అని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. హర్యానాలో ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ అనుచర గణాన్ని వాడుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోందన్నారు.
Also Read :Mount Everest Growth : ‘ఎవరెస్టు’ ఎత్తు ఎందుకు పెరుగుతోంది.. ఆసక్తికర నివేదిక
హర్యానాలో ఆర్థికంగా తనను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాబర్ట్ వాద్రా చెప్పారు. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానాలో తనకు సంబంధించిన కంపెనీ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇవ్వగలనని వాద్రా తెలిపారు. గత ఐదేళ్లలో హర్యానాలోని తన వ్యాపార సహచరులను బీజేపీ సర్కారు వేధించిందని చెప్పారు. ఒకవేళ హర్యానాలో సానుకూల వాతావరణం ఉండి ఉంటే ఎంతోమంది యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ విడుదలపై రాబర్ట్ వాద్రా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమిలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది.