Site icon HashtagU Telugu

Army Helicopter Cheetah Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

Army Helicopter Cheetah Crash

Resizeimagesize (1280 X 720) (3)

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ చీతా (Army Helicopter Cheetah Crash) గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు. చనిపోయిన పైలట్ల మృతదేహాలను లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి, మేజర్ జయంత్ ఎగా గుర్తించి, క్రాష్ సైట్ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, తుది చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్మీ విచారణకు ఆదేశించిందని తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాకు పశ్చిమాన మాండ్లా సమీపంలో సైన్యానికి చెందిన హెలికాప్టర్ గురువారం ఉదయం కూలిపోయింది. జిల్లాలోని సంగే గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యిందని, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని మిస్సమారీకి వెళ్తోందని సైన్యం తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌కు ATCతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందిందని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. బోమిడిలాకు పశ్చిమాన మండల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఆ తర్వాత తెలిసింది.

Also Read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

గత ఏడాది అక్టోబర్‌లో కూడా తవాంగ్ ప్రాంతంలో సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా కూలిపోయి చికిత్స పొందుతూ పైలట్ మరణించాడు. గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ చీతా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు IAF సిబ్బంది, ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.