Rajasthan New CM : రాజస్థాన్‌లోనూ సీఎంగా కొత్త వ్యక్తే.. కాసేపట్లో క్లారిటీ

Rajasthan New CM : కొత్త సీఎంల ఎంపికలో బీజేపీ అధిష్టానం కొంగొత్త పుంతలు తొక్కుతోంది.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 02:46 PM IST

Rajasthan New CM : కొత్త సీఎంల ఎంపికలో బీజేపీ అధిష్టానం కొంగొత్త పుంతలు తొక్కుతోంది. సీనియారిటీతో పాటు స్థిరత్వం, ప్రజాదరణ, విధేయత, వయసు వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ లెక్కన అందరినీ ఆశ్చర్యపరిచేలా ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​‌లకు కొత్త సీఎంలను నియమించింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్​ యాదవ్​ను,  ఛత్తీస్​గఢ్​ సీఎంగా విష్ణు దేవ్​సాయ్​ని నియమించింది. ఇక రాజస్థాన్‌లో సీఎం కాబోతున్న కొత్త ముఖం ఎవరు ? అనే దానిపై సర్వత్రా  సస్పెన్స్ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

రాజస్థాన్‌లోని 199 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లను గెల్చుకుంది. రాజస్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధరా రాజే, దియా కుమారి, మహంత్​ బాలక్​నాథ్, కిరోడీలాల్​ మీణా, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్​రామ్ మేఘ్​వాల్, అశ్విన్​ వైష్ణవ్ ఉన్నారు. అయితే వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. రాజస్థాన్‌లో కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్​నాథ్​, పార్టీ నేతలు సరోజ్​పాండే, వినోద్ తావ్డేలకు బీజేపీ అధిష్టానం అప్పగించింది.

Also Read: 24 Killed : పాక్‌ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి

జైపూర్‌లో ఇవాళ సాయంత్రం  4 గంటలకు కొత్త ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై కొత్త సీఎం పేరును ప్రకటిస్తారు. ఈనేపథ్యంలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం వసుంధరా రాజేతో భేటీ అవుతుండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఈవిధంగా ఎమ్మెల్యేలు మాజీ సీఎంలతో భేటీ కాలేదు. దీంతో బీజేపీ అధిష్టానం వసుంధరా రాజే వైపు అనుమానపు చూపులు చూస్తోంది. ఈనేపథ్యంలో ఆమెకు ఈసారి సీఎంగా ఛాన్స్ దక్కకపోవచ్చని అంటున్నారు. దీంతో కొత్తవారే సీఎంగా(Rajasthan New CM) ఛాన్స్ దక్కించుకుంటారనే విషయం క్లియర్ అయిపోతోంది.