Indian Crew : అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలోని పటాప్స్కో నదిపై ఉన్న ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి’ పిల్లర్లను డాలీ అనే ఓడ మంగళవారం ఢీకొట్టిన సంగతి మనకు తెలిసిందే. నౌక ఢీకొనడంతో ఈ భారీ వంతెన కూలిపోయింది. వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. అయితే వంతెనను ఢీకొట్టిన నౌక సిబ్బందిలో 22 మంది భారతీయులే ఉన్నారని వెల్లడైంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువే ఉండొచ్చని బాల్టిమోర్ సిటీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి కెవిన్ కార్ట్రైట్ అంచనా వేశారు. ఇప్పటివరకైతే మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉష్ణోగ్రత మైనస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంది.నదిలో ఓడ మునిగిపోయాక దాని నుంచి ఆయిల్ లీకేజీ జరిగిందా లేదా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. డాలీ నౌకలో అనేక కంటైనర్లు లోడ్ చేసి ఉన్నాయి. వంతెన అనేక భాగాలు ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్నాయి. ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లభించలేదని అధికారులు అంటున్నారు. ‘‘నౌక దారి తప్పి వంతెనను సమీపించడంతో హెచ్చరిక జారీ అయింది. అనంతరం వంతెన వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. దీంతో చాలామంది ప్రాణాలు నిలిచాయి’’ అని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
డాలీ నౌక సింగపూర్కు చెందిన ‘సినర్జీ మెరైన్ గ్రూప్’కు చెందినది.నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ‘క్వాలిఫైడ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సర్వీస్’ ఏర్పాటుచేశామని వెల్లడించింది.