భారత్ రాష్ట్రీయ సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) తాజాగా యువతపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జరిగిన NDTV యువ కాంక్లేవ్లో పాల్గొన్న ఆయన, నేపాల్లో జెన్జెడ్ (Gen Z) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలను ఉదహరిస్తూ, భారతదేశంలోనూ అలాంటి ఉద్యమాలు జరగవచ్చని హెచ్చరించారు. “ప్రభుత్వాలు ప్రజల ఆశల్ని విఫల పరుస్తూనే ఉంటే, యువత తిరగబడి నిరసనలు వ్యక్తం చేయడం సహజం. నేపాల్లో జరిగినది ప్రజాస్వామ్యాన్ని, యువత స్వరాన్ని అణచివేత తప్ప మరేమీ కాదు” అని ఆయన స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు కోసం పోరాడినప్పటికీ, తొలుత వారిని మీడియాలో కూడా ఎగతాళి చేశారని ఆయన గుర్తు చేశారు.
H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భారతదేశానికి ప్రయోజనమా??
“ఇది ధైర్యవంతమైన, సృజనాత్మకమైన, డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్న తరం. మీరు DIY (Do It Yourself) జనరేషన్ – భిన్నతను చూపించే, ఊహాశక్తితో ముందుకు సాగే తరం” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 400 ఎకరాల అడవి భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటాన్ని ఉదాహరణగా చూపారు. ఆ పోరాటం చివరకు సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లి, భూమి రక్షించబడిందని ఆయన పేర్కొన్నారు. ఇది జెన్జెడ్ తరం ఆవేశం, చైతన్యం, ధైర్యానికి నిదర్శనమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అయితే సోషల్ మీడియా యాక్టివిజం మాత్రమే సరిపోదని హెచ్చరించిన కేటీఆర్, యువత ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. “ప్రపంచం వృద్ధాప్యం వైపు వెళ్తున్నా, భారత్ యువతతో నిండిపోయింది. మనకు జంప్ చేసే లగ్జరీ లేదు, పోల్వాల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలి” అని ఆయన పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి గురించే మాట్లాడిన ఆయన, “మేము చేసిన అభివృద్ధిని సరిగా ప్రచారం చేయలేకపోయాం. కాంగ్రెస్ మాత్రం పెద్ద వాగ్దానాలు చేసింది. చివరికి మేము ఓటమి బారిన పడ్డాం” అన్నారు. యువతను ఆకట్టుకోలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు.
