తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే), ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరగా, ఆయన అందుకు వెంటనే అంగీకరించలేదు. పూర్తిస్థాయి మెజారిటీని నిరూపించుకోవాలని స్పష్టం చేయడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినప్పటికీ, ఆ సంఖ్య 113కు మాత్రమే చేరింది. మెజారిటీకి ఇంకా ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో, గవర్నర్ అర్లేకర్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవసరమైన సంఖ్యాబలం లేని పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే, అది ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించినట్లు అవుతుందని, అది రాజ్యాంగబద్ధంగా సరైంది కాదని నిపుణులు గవర్నర్కు సూచించినట్లు తెలుస్తోంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కలిగితేనే ముందుకు వెళ్లాలని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ రాజకీయ అనిశ్చితికి త్వరగా తెరపడకపోతే, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
