తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్.. ఓ వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్కు సమర్పించారు. తమిళనాడు శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని, తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు బుధవారం లేఖను అందించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవటంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్కు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వనట్లు తెలిసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ టీవికే అధినేత విజయ్.. బుధవారం గవర్నర్ను కలిసిన సంగతి తెలిసిందే. లోక్భవన్ చేరుకున్న విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. 112 మంది ఎమ్మె్ల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందించారు విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కు అనుమతి లభించనట్లు తెలిసింది. తమిళనాడు అసెంబ్లీ సామర్థ్యం 234 సీట్లు కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. అయితే విజయ్కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించటంతో ఈ బలం.. 112కు చేరింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవటంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కు ఇంకా అనుమతి లభించనట్లు తెలిసింది. ఈ విషయంలో విజయ్, గవర్నర్కు సర్దిచెప్పలేకపోయినట్లు సమాచారం.
