Current Shock : యజమానికి కరెంట్ షాకిచ్చిన వంటమనిషి.. ఆ తర్వాత ?

యజమాని తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని.. ఆమె వంట మనిషి(Cook) ఆమెకు ఖంగుతినే కరెంట్ షాకిచ్చి(Current Shock) రివేంజ్ తీర్చుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
A Cook gives Current Shock to his Owner

A Cook gives Current Shock to his Owner

యజమాని తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని.. ఆమె వంట మనిషి(Cook) ఆమెకు ఖంగుతినే కరెంట్ షాకిచ్చి(Current Shock) రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) నగరంలోని అంధేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేత్ షీబా సేథ్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. తన ఇంట్లో వంట చేసేందుకు రాజు సింగ్ అనే వ్యక్తిని వంటమనిషిగా పెట్టుకుంది. అతను చెప్పిన పని సరిగ్గా చేయడం లేదని గ్రహించిన సేథ్.. ఒకసారి అతడిపట్ల దురుసుగా ప్రవర్తించింది. దాంతో రాజుసింగ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. తనపట్ల దురుసుగా ప్రవర్తించిన సేథ్ పై కక్ష తీర్చుకోవాలని భావించాడు.

ఆదివారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం రాజు.. సేథ్ ఫ్లాట్ కు వెళ్లి.. తనవద్ద ఉన్న మరో తాళంచెవితో ఇంటి తలుపులు తెరిచాడు. గాఢనిద్రలో ఉన్న సేథ్ ను చూసి.. తన ప్రణాళిక ప్రకారం విద్యుత్ బోర్డులోని సాకెట్ లో వైర్లను ఉంచి ఆమెకు కరెంట్ షాకిచ్చాడు. ఉలిక్కిపడి లేచిన సేథ్ ను.. ఇప్పుడెలా ఉంది ? అని రాజు ప్రశ్నించాడు. అలా పలుమార్లు ఆమెకు విద్యుత్ షాకిచ్చి పైశాచిక ఆనందం పొందాడు. రాజు చేసే చిత్రహింసల్ని భరించలేని సేథ్.. అతడితో వాగ్వాదానికి దిగింది.

ఎందుకిలా చేస్తున్నావంటూ గొడవ పడటంతో.. రాజు ఆమె గొంతునులిమేందుకు యత్నించాడు. సేథ్ గట్టిగా కేకలు పెట్టడంతో పక్క గదిలో నిద్రిస్తున్న ఆమె కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ.. రాజు తన కొడుకుని కూడా ఏమైనా చేస్తాడేమోనని భయపడిన సేథ్ అతడిని పారిపోవాలని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత సేథ్ ను వదిలిన రాజు.. తనను క్షమించాలని, తాను ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనను సేథ్ తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పగా.. వారంతా ఆమె ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందినట్లు అంబోలి పోలీస్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుడు రాజుసింగ్ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

 

Alao Read : Laila Rao Investment Fraud: లైలారావు’ నయా మోసం.. మహిళలే టార్గెట్

  Last Updated: 19 Sep 2023, 08:36 PM IST