దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ వినియోగం కూడా పెరుగుతోంది.
దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నట్టు తాజా నివేదిక పేర్కొంది. భారత ఉద్యోగర్హత నైపుణ్యాల నివేదిక-2026 పేరుతో చేపట్టిన ఈ సర్వేలో 78.64 శాతం మందితో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలోనూ.. మహారాష్ట్ర(75.42%), కర్ణాటక (73.85%), కేరళ (72.16%), ఢిల్లీ (71.25%) తర్వాతి స్తానాల్లోనూ ఉన్నాయి. వీబాక్స్ సంస్థ ఏఐసీటీఈ, సీఐఐ సహకారంతో ఈ సర్వేను చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 7 లక్షల మందికి గ్లోబల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్ (గెట్)ను నిర్వహించింది. ఇందులో 56.35 శాతం మంది 60% పైగా స్కోర్ సాధించారు.
ఇక, పని చేయడానికి ఇష్టపడే మహిళల విషయానికి వస్తే టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. వీటి కంటే ముందు రాజస్థాన్, కేరళ ఉన్నాయి. ఉద్యోగ నైపుణ్యాల జాతీయ సగటులో పురుషులను మహిళలు అధిగమించడం చెప్పుకోదగ్గ అంశం. మహిళల సంఖ్య 54%గా ఉంటే.. పురుషుల సంఖ్య 51.5% గా ఉంది. మహిళల్లో నైపుణ్యాల మెరుగుదలకు హైబ్రిడ్ పని విధానం, డిజిటల్ నైపుణ్యాభివృద్ధి దోహదం చేశాయి. మూడేళ్ల కిందట 53.28% మంది ఉద్యోగ నైపుణ్యాలు కలిగి ఉండగా.. వచ్చే ఏడాదికి ఇది 54%గా ఉంటుందని అంచనాకు వచ్చారు.
వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసినవారిలో ఉద్యోగర్హత నైపుణ్యాల విషయానికి వస్తే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్లో 72.76%, బీటెక్ 70.15% మందికి ఉపాధి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ, 2025తో పోల్చితే 2026కి ఇవి తగ్గడం గమనార్హం. ఎంబీఏ చేసినవారిలో 5%, బీటెక్ గ్రాడ్యుయేట్లలో 1.35% తగ్గింది.
ఇంగ్లీష్ భాష సామర్థ్యం అత్యధికంగా ఉన్నవారిలో 68.23%తో మహారాష్ట్ర మొదటి స్థానంలోనూ.. తర్వాతి పంజాబ్, ఢిల్లీ నిలిచాయి. క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాల్లోనూ టాప్లో మహారాష్ట్ర (68.23%), ఉత్తర్ప్రదేశ్ (67.89 %) ఉండటం విశేషం.
ఉద్యోగాలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీలు మొదటి వరసలో ఉన్నాయి. నగరాల విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పుణే, ముంబయి, చెన్నైలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
పురుషులు గ్రాఫిక్ డిజైన్ (83.11%), ఇంజినీరింగ్ డిజైన్ (64.67%) వంటి రంగాల్లో ఉద్యోగాలను ఇష్టపడుతుండగా.. లీగల్ (96.4%), హెల్త్కేర్ (85.95%) రంగాల వైపు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
ఉద్యోగ నియామకాల్లో ఆర్టిషిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగింది. ఐటీలో 70 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్స్, సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 50 శాతం ఏఐను పూర్తిగా లేదా పాక్షికంగా వినియోగిస్తున్నట్టు వెల్లడయ్యింది.
వయసుల వారీగా ఉద్యోగ అర్హత నైపుణ్యాలకు వస్తే 22-25 ఏళ్లలోపు వాళ్లు 75.7% ఉండగా.. 18-21 ఏళ్లలోపు వారు 71.38%, 26-29 ఏళ్లలోపు వారు 71.79% మంది ఉన్నారు. అలాగే, 22-25 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో అధికంగా ఉన్నారు.
బీమా, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో యూపీ, కేరళ, తెలంగాణల్లో టైర్-2, టైర్-3 ప్రాంతాల్లో మహిళా భాగస్వామ్యం అధికంగా ఉంది.
