2 Soldiers Killed : మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన ఉగ్రవాద మూకలు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి 12:45 నుంచి 2:15 గంటల మధ్య కొండపై నుంచి వారు విచక్షణారహితంగా మణిపూర్ పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. బాంబులు కూడా విసిరారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరస్ సేన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కాగా, మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన సైనికులను సీఆర్పీఎఫ్ ఎస్సై సాకర్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీలుగా(2 Soldiers Killed) గుర్తించారు.దీంతో మణిపూర్లో హింసాకాండ ఇంకా ఆగలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. దాడికి పాల్పడిన కుకీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరిగింది. బిష్ణుపూర్ జిల్లా దీని పరిధిలోకే వస్తుంది. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాకాండలోనూ ముగ్గురికి గాయాలయ్యాయి. ఈనెల 22న మణిపూర్లోని లువాంగ్సనోల్ సెక్మై ప్రాంతంలో కుకీ, మైతీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మొత్తం మణిపూర్ ఇంకా అగ్నిగుండంలానే ఉంది. మళ్లీ ఎప్పుడైనా అక్కడ ఉగ్రమూకలు భారీ హింసకు దిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడాన్ని బట్టి.. ఆయా ఉగ్రవాద సంస్థలకు మణిపూర్లో ఎంత బలమైన పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది మే 3 నుంచి మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. నాటి నుంచి కుకీ, మైతీ వర్గాల మధ్య నిరంతరం కాల్పులు, దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 200మందికి పైగా మరణించగా.. 1100 మందికిపైగా గాయపడ్డారు. సుమారు 65,000 మంది నిరాశ్రయులయ్యారు. తమకు కూడా తెగ హోదా ఇవ్వాలని మైతీలు డిమాండ్ చేస్తున్నారు.