Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా

మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.

Published By: HashtagU Telugu Desk
Amit Shah

Amit Shah

Amit Shah : ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టి సోమవారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు. ఇది కేవలం పరిపాలన కాదని, ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయాణమని పేర్కొన్నారు. ఆర్థిక పునరుద్ధరణ నుంచి జాతీయ భద్రత వరకు ప్రతీ అంశంలో భారత్ తన స్థాయిని మెరుగుపరచుకుంటోంది. దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్తున్న ఈ యాత్ర మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైంది అని అమిత్ షా పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramarka : మహిళల ఉచిత ప్రయాణానికి రూ.182 కోట్లు జీరో టికెట్లు: భట్టి విక్రమార్క

మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014లో కేంద్రంలో విధానపరమైన సంక్షోభం కొనసాగుతుందన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నిరుద్యోగం, కుంభకోణాలు, పరిపాలన లోపాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని గుర్తుచేశారు. అలాంటి స్థితిలో బాధ్యతలు చేపట్టిన మోదీ, స్థిరమైన పాలనతో దేశాన్ని గాడిలో పెట్టారని వివరించారు. గత 11 ఏళ్లలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాల కోసం అనేక విధానాలు అమలు చేసినందునే దేశ అభివృద్ధి సమగ్రంగా సాగుతోందని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలకు బదులుగా, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ అనే ధ్యేయంతో దేశం ముందుకు సాగుతోంది. ఇది వాగ్దానం కాదని, కార్యాచరణగా మారింది అన్నారు.

జాతీయ భద్రతలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి దేశాన్ని రక్షణ పరంగా బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నక్సలిజం ప్రస్తుతం ముగింపు దశలో ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టి సందేశం ఇచ్చిందని తెలిపారు. చివరిగా, బలమైన నాయకత్వం, దీర్ఘకాలిక దృక్పథం, ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత ఉంటేనే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని మోదీ సర్కారు తేటతెల్లం చేసిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Read Also: RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

  Last Updated: 09 Jun 2025, 05:15 PM IST