నేటి రోజుల్లో చాలా మంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడికైనా ప్రతి వ్యక్తికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీంతో డిప్రెషన్కు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా సరే ఇట్టే మటుమాయం అవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి? దాన్ని ఎలా వేయాలి? తెలుసుకుందాం.
అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ఈ సమకోణాసనం చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వేయాలో తెలుసుకుందాం. నేలపై నిలబడి కాళ్లను దగ్గరకు ఉంచాలి. తరువాత ముందుకు నెమ్మదిగా వంగాలి. ఇలా వంగినప్పుడు శరీర భంగిమ ఆంగ్ల అక్షరం L ఆకారంలో ఉండాలి. నడుం దగ్గర వంగి ముందుకు శరీరాన్ని నిటారుగా వంచాలి. తరువాత రెండు చేతులను ముందుకు చాపాలి. వాటి మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖాన్ని కిందకు ఉంచి నేలను చూస్తుండాలి. ఇలా ఈ భంగిమలో మీకు వీలైనంత సేపు ఉండాలి.
ఈ సమకోణాసనాన్ని రోజూ కనీసం 10 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు మనసుకి హాయిగా ఉంటుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలోని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. కండరాల నొప్పులు తగ్గడంతో పాటు వెన్నెముక దృఢంగా మారుతుంది. రోజూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే వారికి ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మెడ నొప్పి కూడా తగ్గుతుంది. దీన్ని రోజుకు కనీసం 10 సార్లు లేదా 10 నిమిషాల పాటు చేస్తే సరైన ఫలితం లభిస్తుంది.
ముఖ్య గమనిక:
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కాళ్లలో సమస్యలు ఉన్నవారు.. ఈ ఆసనాన్ని వేయకూడదు.
Practicing this asana every day makes even the most intense stress vanish!
