“ఫార్ములా ఈ -రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా రూ.10 కోట్లను హవాలా రూపంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లికి కేటీఆర్ అందించినట్లు విచారణలో తేలింది” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించినట్లుగా న్యూస్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ న్యూస్ క్లిప్కు సంబంధించిన నిజమేంటో ఇప్పుడు చూద్దాం.ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ను ఇక్కడ చూద్దాం.
ప్రచారం : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలిందని ‘Way2News’ వార్తా కథనంలో ప్రస్తావించారు.
వాస్తవం : ఆ న్యూస్ క్లిప్ను ‘Way2News’ ప్రచురించలేదు. ‘Way2News’ లోగోను అక్రమంగా, అనధికారికంగా వాడుకొని తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ కూడా 2024 డిసెంబర్ 25వ తేదీన X(ట్విట్టర్) పోస్టు ద్వారా ప్రకటించింది. ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తునకు సంబంధించి తెలంగాణ ఏసీబీ ఇప్పటిదాకా, అంటే ఈ కథనాన్ని ప్రచురించే సమయం వరకు ఎలాంటి సమాచారాన్ని రకుల్ ప్రీతి పెళ్లికి హవాలా డబ్బుల గురించి వెల్లడించలేదు. కాబట్టి ఆ న్యూస్ క్లిప్లోని సమాచారమంతా పూర్తిగా తప్పు.
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో కేటీఆర్ పంపినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలిందా? వైరల్ పోస్టులో ప్రస్తావించిన వివరాల్లో నిజమెంత అనే విషయాన్ని తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం. ఈక్రమంలో ఇంటర్నెట్లో ఆ అంశాలతో ముడిపడిన కీవర్డ్స్తో సెర్చ్ చేశాం. ఆ న్యూస్ క్లిప్ను బలపర్చే సమాచారమేదీ మాకు కీవర్డ్ సెర్చ్లో లభించలేదు. ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదని తేలింది.
రకుల్ పెళ్లికి కేటీఆర్ హవాలా డబ్బు పేరుతో రూపొందించిన ఫేక్ న్యూస్క్లిప్ యూఆర్ఎల్ లింక్ (https://way2.co/b7dehw)ను మేం ‘Way2News’ వెబ్సైట్లో వెతికాం. ఆ యూఆర్ఎల్ లింకుతో 2024 డిసెంబర్ 13న “అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్” అనే టైటిల్తో ఒక కథనం పబ్లిష్ అయింది. ఆ అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేసి.. దానిలో రకుల్- కేటీఆర్కు సంబంధించిన వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను జతపరిచారని వెల్లడైంది. ఈ న్యూస్ క్లిప్ వైరల్ కావడంతో 2024 డిసెంబర్ 25న Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ.. “ఇది Way2News ప్రచురించిన కథనం కాదు.. కొందరు మా ఫార్మాట్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని తేల్చి చెప్పింది. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్లోని వెబ్ లింక్తో వారు ప్రచురించిన అసలు వార్తను కూడా Way2News సంస్థ వారు షేర్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ- కార్ రేస్ను 2023 ఫిబ్రవరిలో నిర్వహించారు, 2024లో కూడా ఫార్ములా ఈ -కార్ రేస్ నిర్వహించేందుకు గత ప్రభుత్వం 2023 అక్టోబర్లో ఫార్ములా-ఈ ఆపరేషన్స్(FEO) అనే కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ. 55 కోట్లను FEO కంపెనీకి చెల్లించింది. ఈ డబ్బుల చెల్లింపులోనే అవినీతి జరిగిందని, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను హెచ్ఎండీఏ పాటించలేదని పేర్కొంటూ ఏసీబీకి MA & UD ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దాన కిషోర్ కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2)తో పాటు ఐపీసీ 409,120(B) సెక్షన్ల కింద 2024 డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడొచ్చు. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన FIR కాపీని ఇక్కడ చూడొచ్చు.
ఈ ఫ్యాక్ట్ చెక్లో చివరగా తేలింది ఏమిటంటే.. ఫార్ములా ఈ- రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా రూ.10 కోట్లను హవాలా రూపంలో రకుల్ ప్రీత్ సింగ్ వివాహానికి కేటీఆర్ పంపినట్లు విచారణలో తేలిందని పేర్కొంటూ ప్రచురితమైన కథనం ‘Way2News’ సంస్థది కాదు.
(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్గా ‘factly’ వెబ్సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)