Rs 2000 Notes : రూ.2వేల నోట్లు మార్కెట్లో ఇంకా చలామణిలోనే ఉన్నాయి. మరో రూ.7,581 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఇంకా దేశ ప్రజల వద్దే ఉన్నాయట. ఈవిషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. మార్కెట్లో నుంచి తమకు ఇప్పటివరకు 97.87 శాతం మేర రూ.2వేల నోట్లు తిరిగి వచ్చేశాయని వెల్లడించింది. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటన చేసింది. ఆ రోజు నాటికి మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
2023 సంవత్సరం అక్టోబరు 7 వరకు రూ.2వేల నోట్లను దేశంలోని అన్ని బ్యాంకుల్లో మార్పిడి చేశారు. అనంతరం హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలు కల్పించారు. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాలలో ఉన్నాయి. దేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీసు నుంచి ఏదైనా ఆర్బీఐ కార్యాలయాలకు పోస్ట్ ద్వారా రూ.2వేల నోట్లను పంపే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.కాగా, కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో రూ. 2000 నోట్లను(Rs 2000 Notes) ప్రవేశపెట్టింది. అప్పటివరకు చలామణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రూ.2వేల నోట్లను ఆనాడు అందుబాటులోకి తీసుకొచ్చారు.