భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఏడుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.
దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ క్యాంపస్లో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కొందరు ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ సహా మొత్తం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ కూడా స్పందించింది. అరెస్ట్ అయిన ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. పని ప్రదేశాల్లో ఇలాంటి వేధింపుల్ని ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు విచారణకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీసీఎస్ నాసిక్ క్యాంపస్లోని ఓ మహిళా ఉద్యోగి.. తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరిట తనను మోసగించినట్లు చెప్పారు. దీనిని దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందానికి షాకింగ్ నిజాలు తెలిశాయి. మరో ఏడుగురు మహిళలు ముందుకొచ్చి.. తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మతమార్పిడికి యత్నించారని ఆరోపించారు. హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ సహా అసిఫ్ అన్సారీ, షారుఖ్ ఖురేషీ, రజా మేమన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, షఫీ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరందరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
2022-26 మధ్య పని ప్రదేశంలోనే వీరంతా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత ఉద్యోగులు పేర్కొన్నారు. అనుచితంగా తాకడం, బాడీ షేమింగ్ చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం సహా నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఆర్ విభాగానికి సదరు బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు.. మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగుల్ని పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించి మిగతా ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.
ఇక నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో ఈ లైంగిక వేధింపుల వ్యవహారంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా స్పందించారు. ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకరం అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పిన ఆయన.. ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతుందని అన్నారు. మరోవైపు.. నాసిక్ క్యాంపస్ వ్యవహారంపై ఐటీ ఉద్యోగుల సంఘం (NITEs) కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటివి జరగకుండా చూసేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది.
