YSRCP With Mamata : విపక్ష ‘ఇండియా’ కూటమికి కాబోయే సారథి ఎవరు ? దీన్ని ముందుండి నడపబోయే నేత/నాయకురాలు ఎవరు ? అనే దానిపై ఇప్పుడు అంతటా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈవిషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. ఆమెకు ఇండియా కూటమి పగ్గాలిస్తే బాగుంటుందని సమాజ్వాదీ, ఉద్ధవ్ శివసేన, ఆర్జేడీ వంటి పార్టీలు బాహాటంగానే చెబుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్సార్ సీపీ కూడా చేరింది. వాస్తవానికి ఇది అనూహ్య పరిణామం.
Also Read :Fake Teachers : డ్యూటీకి డుమ్మా.. ప్రైవేటు వ్యక్తులను డ్యూటీకి పంపుతున్న గవర్నమెంట్ టీచర్స్పై ఫోకస్
మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ‘‘రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియపై మమతా బెనర్జీకి(YSRCP With Mamata) అపార అనుభవం, అవగాహన ఉంది. ఆమె విపక్ష పార్టీల అలయన్స్ను ముందుండి సమర్థంగా నడపగలరు. మమతకు ఈ అవకాశం ఇస్తే ఇండియా కూటమికి బాగా కలిసొస్తుంది. దేశంలోనే అత్యధికంగా 42 లోక్సభ స్థానాలున్న కీలకమైన బెంగాల్ రాష్ట్రానికి సీఎంగా మమత ఉన్నారు. అక్కడ బీజేపీని చిత్తుచేసి, తన పార్టీని వరుసగా గెలిపించుకోవడంలో దీదీ సక్సెస్ అయ్యారు. అందుకే ఆమెకు ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు ఇవ్వొచ్చు’’ అని ట్వీట్లో విజయ సాయిరెడ్డి ప్రస్తావించారు.
Also Read :Google Willow : సూపర్ కంప్యూటర్లను తలదన్నే స్పీడుతో గూగుల్ ‘విల్లో’.. ఏమిటిది ?
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు బీజేపీకి సన్నిహితంగా వైఎస్సార్ సీపీ మెలిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చి.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడంతో జగన్ తన వైఖరిని మార్చుకున్నారు. బీజేపీ ఎప్పటికైనా వైఎస్సార్ సీపీ ఉనికికి ముప్పేనని ఆయన గుర్తించారు. ఈ తరుణంలో కాంగ్రెస్కు చేరువగా వెళ్లడమే మంచిదని జగన్ నిర్ణయించుకొని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల సారథ్యం వహిస్తున్నారు. ఇండియా కూటమికి వైఎస్సార్ సీపీ చేరువైతే.. షర్మిల పరిధిని కూడా చాలా వరకు పరిమితం చేసే అవకాశం దక్కుతుందని జగన్ అండ్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.