Site icon HashtagU Telugu

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

YS Sharmila

YS Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన లోపం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతపరమైన వ్యవహారాల్లో జోక్యంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న మతపరమైన విష ప్రచారాన్ని ఆమె గట్టిగా ఖండించారు.

దళితవాడల్లో సమస్యలపై హైకోర్టు ప్రస్తావన

దళిత విద్యార్థులు చదువుకునే చోట 228 మందికి ఒకే బాత్‌రూమ్ ఉన్నట్టు 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు పేర్కొన్న విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా ప్రస్తావించారు. “కనీసం రోడ్లు, డ్రైనేజీ కూడా SC, ST కాలనీలలో లేవని ప్రశ్నించడం నేరమా? దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు ప్రభుత్వ దృష్టి స్థానికంగా బడులు, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా?” అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాథమిక అవసరాలను విస్మరించి, గుడుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

మత ప్రమోషన్ తగదు

టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. “ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. ఆయన ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం గారు మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదు” అని ఆమె హెచ్చరించారు.

Also Read: Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

బీజేపీ-RSSపై షర్మిల ధ్వజం

తాము హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా తనపై బీజేపీ, RSS మత ఛాందసవాదులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, బీజేపీ వాదులు ఆపాదిస్తున్నారు. మత రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ, RSS చేస్తున్నవి నీచ రాజకీయాలు,” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ సిద్ధాంతం

కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకం కాదని, సర్వమత సమ్మేళనం తమ సిద్ధాంతమని షర్మిల స్పష్టం చేశారు. “రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం అనేది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు” అని ఆమె అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, వెంటనే సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది తానేనని ఆమె గుర్తు చేశారు.

ప్రభుత్వానికి సవాల్

ప్రజల పక్షాన తమ డిమాండ్‌లో మంచిని వెతకకుండా చంద్రబాబు సమాధానం చెప్పకుండా, కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు అని షర్మిల విమర్శించారు. “ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుంది. ఎవరు మత పిచ్చిగాల్లో, ఎవరు మత విద్రోహులో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వండి” అని ఆమె డిమాండ్‌తో తన ప్రకటనను ముగించారు.

Exit mobile version