YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియ అట్లూరితో జరిగిన ఈ వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Sharmila) హాజరుకాలేదు. కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకానట్లు తెలిసింది. అయితే నూతన వధూవరులు ఇంటికి తిరిగొచ్చాక.. జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు వైఎస్ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు (మూడు రోజుల పాటు) ప్యాలెస్లో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. 16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 18న (ఇవాళ) ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది.
Congratulations RajaPriya #RajaPriya #Haldi #wedding #happyforbothofyou ♥️ pic.twitter.com/qffN2ofJSq
— YS Sharmila (@realyssharmila) February 17, 2024
We’re now on WhatsApp. Click to Join
కుమారుడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్లో నూతన వధూవరులు ముస్తాబవగా.. మిగిలిన వారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియల కుటుంబసభ్యులు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మలు రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.
రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్ధం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో జనవరి 18న జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే రాజారెడ్డి చదువు పూర్తి చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మొదట విజయమ్మ ఆశీర్వదించారు.