అధికారం కోసం కనిపించిన వాళ్ల తలపైన చేయివేసి దీవించారు జగన్. ముద్దులు కురిపించి ప్రేమను చాటారు. ఆలింగనం చేసుకుని ఆప్యాయతను పంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ కనిపించిన వాళ్లను వదలకుండా హగ్ చేసుకున్నారు. మానవత్వాన్ని చాటుతూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని ఏపీ ప్రజలు అందించారు. సీన్ కట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం సామాన్యులకు గగనం అయింది. మూడేళ్లుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టడానికి ఎవరికీ సాధ్యపడడంలేదు. పార్టీలోని కీలక లీడర్లకు మినహా సామాన్యులకు జగన్మోహన్ రెడ్డి మొఖం కూడా చూపడంలేదు. ఫలితంగా న్యాయం కోసం వచ్చిన మహిళ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం గమనార్హం.
తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలవరపరుస్తోంది. ఆమె కుమార్తెను కబళించిన అనారోగ్య సమస్యలను తెలియచేయడానికి ఆమె సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. వెన్నుముక సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమార్తెను కాపాడుకోవడానికి ఆ తల్లి పరితపించింది. సహాయం చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డిని అర్థించడానికి ఆరుద్ర అనే మహిళ సీఎం ఆఫీస్ వద్ద పడిగాపులు కాసింది. చక్రాల కుర్చీలో కదలలేని స్థితిలో కుమార్తెతో కలిసి వేచిచూసింది. ఎంతకీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి స్పందన రాకపోవడంతో ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆమెది కాకినాడకు సమీపంలోని రాయుడుపాలెం. కూతురికి సంరక్షణ ఖర్చులు చెల్లించాలని, ఇంటిని అమ్మవద్దని మంత్రికి చెందిన ఒక అగంతకుడు ఒత్తిడి తెస్తున్నారని సీఎం ఆఫీస్ లో సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమెను కలిసేందుకు సీఎం అందుబాటులో లేరు. న్యాయం జరగదన్న భయంతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ఈ సంఘటనపై ఆయన పోరాటం ఎలా ఉండేదో అందరూ ఊహించుకోవచ్చు. అంటే ప్రతిపక్షంలో ఉంటే మానవీయ కోణం, అధికారంలో ఉంటే రాజరికం దర్పం జగన్మోహన్ రెడ్డిలోని బొమ్మాబొరుసు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.