Star War: `తాడేప‌ల్లి` పెద‌రాయుళ్లు

టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవ‌రు? మెగా స్టార్ చిరంజీవినా? డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబునా? అనే చ‌ర్చ చాలా కాలంగా న‌డుస్తోంది. డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌తికి ఉన్న రోజుల్లో ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కుగా మెలిగాడు.

  • Written By:
  • Updated On - February 15, 2022 / 03:33 PM IST

టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవ‌రు? మెగా స్టార్ చిరంజీవినా? డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబునా? అనే చ‌ర్చ చాలా కాలంగా న‌డుస్తోంది. డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌తికి ఉన్న రోజుల్లో ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కుగా మెలిగాడు. ఆయ‌న‌కు ప్ర‌ధ‌మ, ప్రియ శిష్యుడుగా మోహ‌న్ బాబు ఉన్నాడు. దాస‌రి మర‌ణించిన త‌రువాత కూడా ఆయ‌న కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా మోహ‌న్ బాబు మెలుగుతున్నాడు. టాలీవుడ్ పెద్ద దిక్కుగా కొన‌సాగిన గురువుగారి వార‌స‌త్వం మోహ‌న్ బాబుకు వ‌స్తుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. పైగా మా అధ్య‌క్షుడుగా విష్ణు ను గెలిపించుకోగ‌లిగాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌మీప బంధువు మోహ‌న్ బాబు..ఇవ‌న్నీ క‌ల‌బోస్తే సినీ ఇండ‌స్ట్రీ పెద్దగా మోహ‌న్ బాబును కొంద‌రు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ పెద్ద దిక్కుగా చాలా సంద‌ర్భాల్లో వ్య‌వ‌హ‌రించాడు. ఆ ముంద్ర వేయించుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంలో కీల‌కంగా వ్య‌వ‌హరించ‌డం ద్వారా ఆ పెద్ద‌త‌నంకు గుర్తింపు నివ్వాల‌ని చూస్తున్నాడు. అందుకు త‌గిన విధంగా ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా మెగాస్టార్ చిరంజీవిని రెండు సార్లు స్వ‌యంగా ఆహ్వానించాడు. ఆయ‌న‌తో ఏకాంత మంత‌నాలు తొలిసారి సాగించాడు. మ‌లివిడ‌త టాప్ హీరోలు ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తదిత‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లాడు. టిక్కెట్ల ధ‌ర‌లు, ఆన్ లైన్ విధానంపై ఒక క్లారిటీని తీసుకొచ్చాడు. కానీ, అధికారికంగా ఏపీ ప్ర‌భుత్వం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి పెద్ద‌దిక్కుగా మెలిగాడు. మీడియా స‌మావేశంలోనూ ఆ విధ‌మైన వ్యాఖ్య‌లు మంత్రి పేర్ని నాని నుంచి వినిపించాయి. ఆ క్ర‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఉద్దేశ పూర్వ‌కంగా చిరంజీవికి ప్రాధాన్యం ఇస్తున్నాడ‌ని కొంద‌రు భావించారు. స‌మీప‌బంధువు అయిన‌ప్ప‌టికీ మంచు కుటుంబానికి ఏ మాత్రం విలువ ఇవ్వ‌డంలేద‌ని టాలీవుడ్ లో బాహాటంగా టాక్ న‌డిచింది.

తాజాగా మంచు విష్ణు మా అధ్య‌క్షుని హోదాలో ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిశాడు.సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఆన్ లైన్ విధానంపై చ‌ర్చంచ‌డానికి జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు తాడేప‌ల్లి వెళ్లాడు. దీంతో మెగాస్టార్ కు ఇచ్చిన సినీ పెద్ద దిక్కు పేటెంట్ పై మ‌ళ్లీ చ‌ర్చ ప్రారంభం అయింది. సంక్రాంతి విందుకు ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన చిరంజీవి ఏపీ సీఎంతో భేటీ అయిన అంశాన్ని ప్రైవేటుగా చూడాల‌ని విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. ఫిల్మ్ చాంబ‌ర్ తో ఏ మాత్రం చ‌ర్చించ‌కుండా చిరు వెళ్ల‌డాన్ని త‌ప్పుబ‌ట్టాడు. రెండో విడ‌త తాడేపల్లి ఇంట్లో ఏపీ. సీఎం జ‌గ‌న్‌, చిరు అండ్ టీం భేటీ త‌రువాత మంత్రి పేర్ని నాని హైద‌రాబాద్ లోని మోహ‌న్. బాబు ఇంటికి వెళ్లాడు. ఆ ఫ్యామిలీతో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన త‌రువాత తాడేప‌ల్లికి రావాల‌ని ఆహ్వానించాడు. ఆ మేర‌కు జ‌గ‌న్ ను క‌లిసేందుకు విష్ణు తాడేప‌ల్లి వెళ్లాడు. జ‌గ‌న్ తాడేప‌ల్లి నివాసంకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లాడు. కానీ, మంచు ఇంటికి మంత్రి పేర్ని నానిని జ‌గ‌న్ పంపాడ‌ని టాలీవుడ్ టాక్‌. అంతేకాదు, చిరు అండ్ టీం వెళ్లిన‌ప్పుడు తాడేప‌ల్లి ప్రోటోకాల్ తో పోల్చుకుంటే, విష్ణు వెళ్లిన‌ప్పుడు ఎక్కువ‌గా ఉంద‌ని ఇరుపక్షాల అభిమానుల మ‌నోభావం.

మా అధ్య‌క్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జ‌గ‌న్ కు సమీపం బంధువు. వైఎస్ ఫ్యామిలీ మెంబ‌ర్ గా ఉన్న అమ్మాయిని ప్రేమించి మంచు వివాహం చేసుకున్నాడు. అప్ప‌టి నుంచి ఇరు కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే, గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న్ బాబు వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేశాడు. ఆ పార్టీకి సానుభూతిప‌రులుగా మంచు కుటుంబీకులు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితిల్లో స‌హ‌జంగా ప్రొటోకాల్ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ, చిరు అంట్ టీం వెళ్లిన‌ప్పుడు అఫిషియ‌ల్ ప్రొటోకాల్ పాటిస్తారు. మంచుకు అఫిషియ‌ల్ అండ్ ప‌ర్స‌న‌ల్ ప్రోటోకాల్ కూడా తాడేప‌ల్లి నివాసం వ‌ద్ద క‌నిపించింది. దీంతో చిరు, విష్ణు వెళ్లినప్పుడు తాడేప‌ల్లి ప్యాలెస్ క‌ద‌లిక‌లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సినీ పెద్ద దిక్కుగా మంచు మోహ‌న్ బాబు పేరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. అటు మోహ‌న్ బాబు ఇటు చిరంజీవి ఇద్ద‌రూ సినీ ముద్ద బిడ్డ‌లం అంటూనే దాస‌రి వార‌సులుగా పెద్ద దిక్కు ముద్ర వేయించుకునే వ్య‌వ‌హారాల‌ను న‌డుపుతున్నారు. దీంతో మ‌ళ్లీ టాలీవుడ్ పెద్ద దిక్కు పేటెంట్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం. సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఆన్ లైన్ విధానంపై ప‌రిష్కారం త‌రువాత ఎవ‌ర‌నేది తేల‌నుంది.