CM Chandrababu : ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు. తాజాగా ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు పొందుతూ అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను ఎంపిక చేసి వారికి అభినందన లేఖలు పంపాలని, ఆ ప్రశంసలను వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని సీఎం సూచించారు. ఇది వారి భవిష్యత్ పదోన్నతులు, వృత్తి అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన వారిని కూడా గుర్తించి తగిన మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
వైద్య, దేవదాయ శాఖలకు కీలక సూచనలు
వైద్యారోగ్య శాఖ పనితీరుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని స్థాయిల్లో పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించవద్దని, ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగించాలని పేర్కొన్నారు. ఎక్కడా వైద్యుల కొరత ఉండకూడదని, అవసరమైతే వెంటనే నియామకాలు చేపట్టాలని కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దేవదాయ శాఖకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖకు ‘ఫ్రెష్ లుక్’ .. అవినీతిపై హెచ్చరిక
రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలంటే స్పష్టమైన మార్పు కనిపించాల్సిందేనని అన్నారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, సేవలను పూర్తిగా ఆటోమేషన్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే ఏసీబీ చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరు లోపించిన తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. అదేవిధంగా తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, అవసరమైతే మొబైల్ ల్యాబ్లను అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆడిట్ నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు సూచించారు. టెక్నాలజీ ఆధారిత ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీ-సేవ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ, వైద్యారోగ్యం, దేవదాయ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనలో సానుకూల మార్పులకు ఈ కొత్త విధానం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
