నల్లమల అడవుల్లో (Nallamala Forest) అండర్గ్రౌండ్ టన్నెల్ (Underground Tunnel) నిర్మాణం ప్రతిపాదన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో (Godavari-Banakacherla Link Project) భాగంగా ముందుకు వచ్చింది. బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు నీటిని మళ్లించేందుకు 27 కిలోమీటర్ల పొడవున భూగర్భ టన్నెల్ తవ్వడం అవసరమవుతోంది. అటవీ, పర్యావరణ అనుమతులు సులభంగా పొందేందుకు ఈ టన్నెల్ను భూగర్భంలో నిర్మించడానికి అధికారులు మొగ్గు చూపుతున్నారు.
Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్కు మరోసారి ఈడీ నోటీసులు
ఈ ప్రాజెక్టులో మొత్తం 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వనున్నారు. ఇందులో కొన్ని చోట్ల ఎత్తిపోతలతో పాటు టన్నెల్ నిర్మాణం అవసరం ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా, నీటి ప్రవాహం పూర్తిగా భూగర్భంలోనే సాగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ టన్నెల్ నిర్మాణానికి దాదాపు 17,000 ఎకరాల అటవీ భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.
పోలవరం నుంచి కృష్ణా నదికి నీటి సరఫరా ప్రారంభ దశలో ఎత్తిపోతల అవసరం లేకుండా ప్రస్తుత కాలువల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం కుడి కాలువను 28,000 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అలాగే తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువల పొడిగింపుతో, సామర్థ్యాన్ని పెంచడంతో గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడానికి వీలవుతుంది. ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల సాగు వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, నీటి వనరుల వినియోగం మెరుగవుతుందని నిపుణులు భావిస్తున్నారు.