Constable To CIVILS : ఆ యువకుడు కానిస్టేబుల్ జాబ్కు రిజైన్ చేసి.. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటాడు. యూపీఎస్సీ పలితాల్లో 780 వ ర్యాంక్ సాధించాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్న తెలుగు తేజం ఉదయ్ కృష్ణారెడ్డి విజయగాథ ఎంతో స్ఫూర్తిదాయకమైంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఉదయ్ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామస్తుడు. ఆయన చిన్నతనంలోనే పేరెంట్స్ను కోల్పోయాడు. దీంతో నాయనమ్మ దగ్గర పెరిగాడు. 2012లో డిగ్రీ చదివే సమయంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఏడేళ్లు కానిస్టేబుల్గా చేసిన తర్వాత రిజైన్ చేశాడు. ఈ రాజీనామా వెనుక ఒక కారణం ఉంది. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు పరిధిలోని రామాయపట్నం పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్న టైంలో అక్కడి సీఐ ఉదయ్ కృష్ణారెడ్డిని 60 మంది తోటి ఉద్యోగుల ఎదుట అవమానించాడు. దీంతో ఆయన 2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. వెంటనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. మొదటి మూడు ప్రయత్నాల్లో సివిల్స్ మంచి ర్యాంకు రాలేదు. కానీ నాలుగో ప్రయత్నంలో(ఈసారి) 780వ ర్యాంక్ (Constable To CIVILS) వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువతకు ఉదయ్ రోల్ మోడల్ గా మారాడు.
‘‘60 మంది తోటి పోలీసుల ఎదుట ఓ సీఐ నన్ను తీవ్రంగా అవమానించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ వెంటనే సివిల్స్ కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మూడుసార్లు రాశాను. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను’’ అని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు. ఐఏఎస్ వచ్చేదాకా తన సివిల్స్ ప్రిపరేషన్ను ఆపేది లేదని ఆయన తేల్చి చెబుతున్నారు. ఆయనకు ఈసారి ఐఏఎస్ కేడర్ కాకుండా, ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసు)లో పోస్టింగ్ లభించే ఛాన్స్ ఉంది.