వచ్చే ఎన్నికలనాటికి అక్కినేని నాగార్జున రాజకీయ రంగ ప్రవేశం చేసి, వైసీపీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నాగార్జునకు సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ స్థానంలో ఆ పార్టీ ఓడిపోతోంది. అందువల్ల విజయవాడ నుంచి పోటీ చేయాలని నాగార్జునకు జగన్ మోహన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని వార్తలు వినిపించాయి.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదని నాగార్జున స్పష్టం చేశారు. విజయవాడలో ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాను పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని చెప్పారు. తాను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాన్నారు. కథ నచ్చితే రాజకీయ నాయకుడిగా నటిస్తానని అక్కినేని నాగార్జున చెప్పారు.