Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. వారిద్దరు కత్తులను పట్టుకొని తిరగడం కలకలం రేపింది. ఈ సంచలన ఘటన పవన్ కల్యాణ్ భీమవరం సభ జరుగుతుండగా చోటుచేసుకుంది. కత్తులతో హల్చల్ చేసిన ఆ ఇద్దరు యువకుల కదలికలను భీమవరం టూ టౌన్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో ఓ యువకుడు పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. వాళ్ల జేబుల్లో కత్తులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సభలో కలకలం రేపిన ఈ ఇద్దరు యువకులను భీమవరానికి చెందిన బలుసుమూడి, దుర్గాపురం గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు ఎవరిపైనైనా దాడి చేయడానికి సభకు వచ్చారా ? దొంగతనాలు చేయడానికి వచ్చారా ? అనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై దాడులు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న సీఎం జగన్పై విజయవాడలో దాడి జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గాజువాకలో దాడికి యత్నించారు. ఈ రెండు ఘటనలు స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపాయి. వీటిని మర్చిపోకముందే.. తాజాగా పవన్ కల్యాణ్ భీమవరం సభలో మరో ఘటన చోటు చేసుకుంది.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వెళ్తారు. అక్కడి నుంచి నేతలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో జరిగే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.