కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. పోలీసుల వేట తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. తాజాగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
దస్తగిరి హత్య జరిగినప్పటి నుండి నిత్యానందరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. ఆయన కోసం పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. అయితే, పోలీసులు ఆయన ఆస్తులపై నిఘా పెట్టడం, అనుచరులను విచారించడంతో ఉచ్చు బిగుస్తోందని గ్రహించిన నిత్యానందరెడ్డి, సోమవారం అనూహ్యంగా జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఆయనను A-13 నిందితుడిగా చేర్చిన పోలీసులు, హత్యకు పథకం వేయడంలో ఆయనదే కీలక పాత్ర అని భావిస్తున్నారు.
ఈ హత్య కేవలం వ్యక్తిగత కక్షల వల్ల జరిగింది కాదు, దీని వెనుక వందల కోట్ల భూ వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. నిత్యానందరెడ్డి, దస్తగిరి ఇళ్లలో జరిపిన సోదాల్లో సుమారు 100 కోట్ల విలువైన భూములకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు దొరకడం సంచలనం రేపింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చడం, ఆ పత్రాలతో బ్యాంకుల్లో భారీ రుణాలు పొందేందుకు ప్రయత్నించడం వంటి అక్రమాల్లో ఇద్దరి మధ్య వచ్చిన తేడాలే దస్తగిరి ప్రాణం తీశాయని పోలీసులు నిర్ధారించారు.
దస్తగిరిని దారుణంగా నరికి చంపిన నిందితులకు నిత్యానందరెడ్డి స్వయంగా ఆశ్రయం కల్పించినట్లు విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన తర్వాత నిందితులు ఆయన ఇంట్లోనే తలదాచుకోవడం, అక్కడి నుండే పరారవ్వడం సంచలనంగా మారింది. కేవలం నిత్యానందరెడ్డే కాకుండా, ఆయన భార్య దీప్తిపై కూడా ఫోర్జరీ కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ భూ కబ్జాల దందా ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది.
ప్రస్తుతం నిత్యానందరెడ్డి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే, ఈ భూ దందాల్లో మరికొందరు వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంలో సహకరించిన అధికారుల జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
