Site icon HashtagU Telugu

Special Status: ప్రత్యేక హోదాలో పచ్చి నిజం

PM Modi and AP MAP

PM Modi and AP MAP

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసు అడ్డు అంటూ కేంద్రం చెప్పింది. కానీ , అది అబద్ధమని తాజాగా 14 వ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పిన దానిప్రకారం అర్ధం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చెందిన మోసం మరోసారి బట్టబయలు అయింది. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎలా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో బహిర్గతం అయింది. మాటల్లో చూపించిన ప్రేమను ప్రధాని నరేంద్ర మోడీ చేతల్లో చూపడం లేదని స్పష్టం అయింది. రాష్ట్రానికి అండగా నిలవడానికి… హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా వంటి వాటిని నెరవేర్చడం కేంద్రానికి… మరీ ముఖ్యాంగా ప్రధాని మోదికి ఇష్టం లేదని తెలిపోయింది. పైకి చెబుతున్న 14వ ఆర్ధిక సంఘం నిబంధనలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏ మాత్రం అడ్డంకి కాదని మరోసారి నిరూపితం అయింది. సాక్షాత్తు ఆ 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు… నేరుగా ప్రధానికి ఆర్ధిక సలహామండలి సభ్యుడుగా ఉన్న వ్యక్తే ఈ సంచలన సంగతులను బయట పెట్టారు.

పొలిటీషియన్ అబద్ధం చెప్పొచ్చు… మాట తప్పవచ్చు. కానీ అధికారికి ఆ అవసరం ఉండదు. అందుకు నిదర్శనమే ప్రధాని ఆర్ధిక సలహా మండలి సభ్యుడిగా ఉన్న ఎమ్. గోవిందరావు మాటలు. ఏపీకి హోదా ఇవ్వడానికి మోడీ సహా ఆర్ధిక మంత్రి జైట్లీ తదితరులు ఎన్ని సాకులు చెప్పినా నిజం దాగలేదు. రూల్ ప్రకారం అయితే అవుతుందని లేకుంటే లేదు అని చెప్పేయడం ఒక్కటే తెలుసు. అలాగే మోడీ ఆర్ధిక సలహాదారుల బృందంలో సభ్యుడైన గోవిందరావు ఏపీకి హోదాపై ఏ దాపరికం లేకుండా స్పందించారు.
గోవిందరావు ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి పలు వాస్తవాలను మరోసారి బయట పెట్టారు. 14వ ఆర్ధిక సంఘం ఎప్పుడూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని కుండా బద్దలు కొట్టారు. “ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని మేము ఆంక్షలు పెట్టలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కేంద్రం ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడైనా నిర్భయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు” అని తేల్చి పారేశారు. అది కేవలం అధికారికంగా కార్యనిర్వాహక వర్గం తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రమేనని గోవిందరావు స్పష్టం చేశారు.

గోవిందరావు ప్రస్తుతం 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు. అలాగే ప్రధాని ఆర్ధిక సలహామండలి వంటి కీలక విభాగంలో అధికారి. అలాంటి వ్యక్తి ఇప్పుడు విషయం ఇది అని చెప్పడంతో ఏపీ ఎదుగుదల ఎవరికి ఇష్టం లేదో తేలిపోయింది. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ ఎందుకు అమలుకు నోచుకోలేదు తేటతెల్లం అయిపోయింది. ప్యాకేజీ పేరు చెప్పి సీఎం చేతులు కట్టేసింది ఎవరో బయటపడింది. హోదా ఇవ్వడం ఇష్టం లేకనే… ఇస్తే ఆంధ్రా ఎక్కడ అభివృద్ధిలో దూసుకు పోతుందో అన్న భయంతోనే రాష్ట్రానికి సంజీవని అయిన హోదా ఇవ్వడం కుదరదని ప్రధాని చెబుతున్నారన్న ఆరోపణలు నిజమని తేలిపోతుంది.

కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అడగకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న పలుకుబడితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు చూసిన కేంద్రం ప్రత్యేక హోదా వంటివి ఇస్తే అభివృద్ధిలో ఏపీ ఇచ్చే పోటీని తట్టుకుని నిలబడలేమని భావించే ఇలా సహాయనిరాకరణ చేస్తుందన్న వాదన నిజమే అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయంలోనూ… రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి విషయంలోనూ మోడీ ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూనే ఉంది. చివరకు ఏపీ డీజీపీగా సమర్ధుడైన అధికారికి పొడిగింపు ఇచ్చే విషయంలో కూడా కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో ప్రస్తుతం చూస్తున్నాం. తెలంగాణలో అప్పటి డిజిపికి పొడిగింపు ఇచ్చిన ప్రభుత్వం ఏపీ విషయంలో కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతూనే ఉంది. సో..ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ చెబుతున్న మాటలు నిజం కాదన్నమాట.