అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. అభివృద్ధికి, విధ్వంస రాజకీయాలకు మధ్యే అసలు పోటీ జరుగుతోందన్నారు.
అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సోమిరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు జాతీయ బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ కంపెనీలు అక్కడ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ, ఎన్ఐడీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజధానిపై అనిశ్చితి సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.
అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి త్యాగాలు చేశారని సోమిరెడ్డి అన్నారు. ప్రస్తుతం రూ.57,821 కోట్ల విలువైన 97 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమరావతి కేవలం నగరం కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అని చెప్పారు. ప్రజల ఆస్తులు, రైతుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జగన్ను హెచ్చరించారు.
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని సోమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, మంత్రి లోకేశ్ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెప్పారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కొత్త నినాదాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
