AP Elections : జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. అయితే అప్పటివరకు ఎదురుచూడకుండా.. ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతాల్లో దీనిపై జోరుగా పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగులను మించిన రేంజులో ఎలక్షన్ బెట్టింగులకు తెర తీస్తున్నారని సమాచారం.వీటిలోనూ మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతున్నాయని అంటున్నారు. డబ్బు అందుబాటులో లేని వాళ్లు తమ ఆస్తులను, దస్తావేజులను కూడా పందెంలో పెట్టేస్తున్నారట. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై ఆస్తులకు సంబంధించి అగ్రిమెంట్లు సైతం రాసుకుంటున్నారట.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? లోక్సభ స్థానాల్లో హవా ఎవరిది ? అనే వివరాలతో ఇటీవల కాలంలో కొన్నిఫేక్ సర్వేలు ప్రసారం అయ్యాయి. వాటి వెనుక కూడా ఎలక్షన్ బెట్టింగ్ ముఠాల హస్తం ఉందని.. బెట్టింగ్ గ్యాంగుల నుంచి సొమ్ము అందిన వారు ఇలాంటి ఫేక్ సర్వేలను విడుదలచేస్తున్నారని చెబుతున్నారు. సర్వేలు చేసేందుకు కొన్ని శాస్త్రీయ ప్రమాణాలు ఉంటాయి. శాంపిల్స్ సేకరణ అనేది సమాజంలోని అన్ని వర్గాలను కవర్ చేస్తూ, ఆ నియోజకవర్గంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తూ జరగాలి. అప్పుడే నిజమైన ఫలితాలకు దగ్గరగే సర్వే నివేదికను విడుదల చేయడం సాధ్యమవుతుంది. కానీ అవేవీ లేకుండా, గ్రౌండ్ వర్క్ లేకుండా ఎలక్షన్ బెట్టింగ్ గ్యాంగుల సైగల మేరకు ఫేక్ సర్వే రిపోర్టులు మార్కెట్లోకి వస్తున్నాయని అంటున్నారు.
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో పార్టీల వారీగా వచ్చే సీట్లపై పందేలను ఇప్పటికే ముగించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయి.. సీఎం ఎవరు అవుతారనే అంశాలపైనా బెట్టింగ్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు రౌండ్లు, మండలాల వారీగా మెజార్టీలపైనే ఎక్కువగా పందేలు కాస్తున్నారు.అభ్యర్థులను ప్రకటించిన సమయంలోనే తొందరపడి పందేలు కాసిన కొందరు.. ఇప్పుడు పరిస్థితులు మారడంతో బోనులో పడిన ఎలుకల్లా విలవిల్లాడుతున్నారు.ఆకివీడు మండలంలో కూలీ పనులు చేసుకునే ఓ మహిళ ఓ పార్టీదే అధికారం అంటూ రూ. 2 లక్షలు పందేం కాయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే ప్రాంతంలో ఓ చిరు వ్యాపారి సైతం రూ.50 వేలు పందెం కాశాడు.