రాష్ట్రంలో యువత భవిష్యత్తుతో ఆటలాడిన చరిత్ర వైఎస్సార్సీపీ, జగన్ కుటుంబానిదేనని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తుంటే, వారిలో గందరగోళం సృష్టించేందుకే వైసీపీ టీచర్ నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.
16,347 మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, పరీక్షల ఫలితాలు, మార్కులు, ర్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉంచిన తర్వాతే తుది ఎంపిక జాబితా విడుదల చేశామని తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించేందుకు జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆందోళనలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, యువతలో అభద్రతాభావం సృష్టించడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. రాష్ట్రంలో యువత అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు.
2006 డీఎస్సీ నియామకాల సమయంలో ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు జరిగాయని, అప్పటి ఘటనలపై కేసులు కూడా నమోదయ్యాయని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని ఆరోపించారు. కడప జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాల పేరుతో ఫేక్ ఉద్యోగాలు ఇచ్చి భారీ అవినీతి జరిగిందని, ఇటీవల అలాంటి నియామకాలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఉపాధ్యాయ నియామకాలు వేగంగా పూర్తయ్యాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపన ద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, పారదర్శక నియామకాలపై అనుమానాలు సృష్టించే రాజకీయ ప్రచారాలను నమ్మవద్దని భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సూచించారు.
