రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీ అమలులో భాగంగా తొలి విడత నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ క్లియర్ చేసినట్లు వెల్లడించింది.
ప్రభుత్వం రూపొందించిన ముందస్తు ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ కారణంగానే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేయగలిగామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
