ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించిన గాదె వెంకటరెడ్డి న్యాయ విద్య (ఎల్ఎల్బీ) పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి 1967లో పర్చూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972, 1978 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అనంతరం 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఓటమి ఎదురైంది. అయితే 1991 ఉప ఎన్నికల్లో, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా తిరిగి విజయం సాధించారు.
నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 2004 మరియు 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, అనంతరం కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ఆలయాల అభివృద్ధి, ధార్మిక సంస్థల పరిపాలనలో ఆయన చేసిన కృషి విశేషంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న గాదె వెంకటరెడ్డి 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం 2020లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీర్ఘకాల రాజకీయ జీవితంలో ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతి రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
