మైలవరం టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. మైలవరం టీడీపీలో స్థానికత తెరమీదకు వస్తుంది. స్థానికులకే మైలవరం టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ కొన్నాళ్లుగా చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చ కాస్త బల నిరుపణగా మారింది. నిన్న(ఆదివారం) టీడీపీ సీనియర్ నేత, విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఛలో గొల్లపూడి అంటూ పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివచ్చారు. ఇటు వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోటో లేకపోవడం ఈ సమావేశం చర్చకు దారితీసింది. మైలవరం నియోజకవర్గానికి స్థానికులే ప్రాతినధ్యం వహించాలంటూ లోకల్ లీడర్స్ డిమాండ్ చేశారు.
బొమ్మసాని సుబ్బారావుకు రాజకీయ వారసత్వం కూడా ఉంది. ఆయన తాత పెదర్ల వెంకట సుబ్బయ్య రెండు సార్లు శాసన సభ్యుడిగా పని చేశారని ఆయన అనుచరులు గుర్తు చేశారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా బ్యాంక్ ప్రెసిడెంట్గా పని చేశారు. ఇటు బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడి పంచాయితీకి మూడు సార్లు సర్పంచ్ గా పని చేశారు. ఆయన తండ్రి బొమ్మసాని కృష్ణమూర్తి రెండు సార్లు గొల్లపూడి సర్పంచ్గా పని చేశారని తెలిపారు. దీంతో ఆయనకు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు అధిష్టానాన్ని కోరుతున్నారు. మొత్తానికి బొమ్మసాని ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి దేవినేని ఉమాకు తలనొప్పిగా మారింది