AP Employees: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘‘ఉద్యోగులు తమ పోస్టింగ్లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసింది. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడమైంది’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘అంగన్వాడీ ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుండి రూ.10,500కు పెంచింది. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘనాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించింది. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పర్చకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్మెంట్ ఇచ్చాం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంతటి అర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదు’’ అని చంద్రబాబు గుర్తు చేశారు.
‘‘ గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, మీ ఇబ్బందులను నేను కళ్ళారా చూశాను. నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి చలించిపోయాను. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాధలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం IR కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్ పీఆర్సీ ప్రకటించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసింది. వారం రోజుల్లో సీపీఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చింది. తద్వారా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చింది. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసింది’’ అని చంద్రబాబు ఆరోపించారు.