క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది.
పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నియామక ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. మొత్తం 3,600 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా, 5,326 పోస్టు ప్రాధాన్యతలు నమోదయ్యాయి. కేవలం 421 పోస్టుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొనడం క్రీడాకారుల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.
నియామక ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడింది. అభ్యర్థులు తమ క్రీడా, విద్యా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా వ్యవస్థను రూపొందించడం ద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచారు.
క్రీడా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం 6 మంది సభ్యులతో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో భౌతిక ధ్రువీకరణ నిర్వహించి, జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర క్రీడా సంఘాలు, విశ్వవిద్యాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాల ప్రామాణికతను నిర్ధారించారు. విద్యార్హతల పరిశీలన కోసం 15 మంది అధికారులను పాఠశాల విద్యాశాఖ నియమించింది.
అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను విడుదల చేసి అభ్య
ర్థులు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 192 ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించారు. అనంతరం తుది ప్రాధాన్యత జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించింది.
నియామక ప్రక్రియపై దాఖలైన 69 న్యాయపరమైన కేసులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటూ, హైకోర్టు ఆదేశాలను పూర్తిగా పాటించింది. అవసరమైన చోట్ల పునఃపరిశీలన చేపట్టి, ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది.
ముఖ్యాంశాలు
* క్రీడాకారుల కోటాలో భర్తీ చేసిన పోస్టులు – 421
* దరఖాస్తు చేసిన అభ్యర్థులు – 3,600 మంది
* నమోదైన పోస్టు ప్రాధాన్యతలు – 5,326
* క్రీడా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీ – 6 మంది సభ్యులు
* విద్యార్హతల పరిశీలనకు నియమించిన అధికారులు – 15 మంది
* పరిష్కరించిన ఫిర్యాదులు – 192
* న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు – 69
* నోటిఫికేషన్ నుంచి తుది జాబితా ఆమోదం వరకు ప్రక్రియ పూర్తి – 112 రోజులు
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రతిభ, పారదర్శకత, న్యాయబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
