ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వేదాంత గ్రూప్కు చెందిన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కంపెనీలో లావాదేవీలు ఫెమా నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే అంశాన్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా సంబంధిత ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు, లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలనకు తీసుకున్నట్లు తెలిసింది. బ్రాండ్ వినియోగానికి సంబంధించిన చెల్లింపులు విదేశీ మారక ద్రవ్య నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. సోదాలపై స్పందించిన వేదాంత ప్రతినిధి.. తాము దర్యాప్తు అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని.. వారు కోరిన అన్ని పత్రాలు, వివరాలను సమర్పిస్తున్నామని తెలిపారు. కంపెనీ అన్ని చట్టాలు, నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉందన్నారు. సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు సేకరించిన పత్రాలు, ఆర్థిక రికార్డులను విశ్లేషిస్తున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఈడీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదిలా ఉండగా, గత నెలలో వేదాంత లిమిటెడ్ తన అనుబంధ సంస్థ అయిన తల్వండి సాబో పవర్ లిమిటెడ్
కు సంబంధించిన కీలక పరిణామాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. విద్యుత్ లభ్యతకు సంబంధించిన సమాచారం తప్పుగా ప్రకటించిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తల్వండి సాబో పవర్ లిమిటెడ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకార ఆలస్య చెల్లింపు సర్ఛార్జీలతో కలిపి సుమారు రూ.127 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
