Kajjikaya Police Complaint Issue : అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు బంధుమిత్రులను ఆహ్వానించడం ఆనవాయితీ. అలాగే ఒక మామ తన ముగ్గురు అల్లుళ్లను పండుగకు పిలిచారు. అల్లుళ్లు వస్తున్నారని ఎంతో ఇష్టంగా ఇంట్లో ‘కజ్జికాయలు’ చేయించారు. అయితే, విందు వడ్డించే సమయంలో పెద్ద అల్లుడికి, రెండో అల్లుడికి కజ్జికాయలు పెట్టిన అత్తమామలు, మూడో అల్లుడిని (చిన్నల్లుడు) మర్చిపోయారు. ఇద్దరు అన్నలకు ఇచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవడంతో అది తన మర్యాదకు భంగం కలిగినట్లుగా భావించిన చిన్నల్లుడు తీవ్ర మనస్తాపానికి గురై, ఏకంగా డైల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వింత ఫిర్యాదు అందగానే పోలీసులు సైతం ఒక్కక్షణం అవాక్కయ్యారు. సాధారణంగా హత్యలు, దొంగతనాల వంటి తీవ్రమైన కేసులను డీల్ చేసే పోలీసులు, ఈ ‘కజ్జికాయల పంచాయితీ’ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ రాజగోపాల్ తక్షణమే ఆ ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తనకు జరిగిన ‘అన్యాయం’ గురించి చిన్నల్లుడు ఆవేదనగా కానిస్టేబుల్కు వివరించారు. “వాళ్లిద్దరికీ పెట్టి నాకు పెట్టకపోవడం ఏంటి సార్? ఇది న్యాయమేనా?” అని ప్రశ్నించడంతో, కానిస్టేబుల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అత్తమామలకు సర్దిచెప్పి, ముగ్గురు అల్లుళ్లను సమానంగా చూడాలని, చిన్నల్లుడికి కూడా కజ్జికాయలు వడ్డించాలని సూచించి ఆ వివాదానికి అక్కడికక్కడే ఫుల్స్టాప్ పెట్టారు.
అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ కానిస్టేబుల్ రాజగోపాల్ చేసిన పనితో మొదలైంది. సమస్య పరిష్కారమైన తర్వాత ఆ కుటుంబంతో కలిసి ఆయన ఒక సెల్ఫీ దిగి, తన పై అధికారుల వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. “సార్, 100 కాల్కు అటెండ్ అయ్యాను. అల్లుడికి కజ్జికాయలు పెట్టలేదన్నది ఇక్కడి సమస్య. అందరికీ సమానంగా పెట్టాలని సూచించాను. ప్రాబ్లం సాల్వ్డ్ సార్” అంటూ ఆయన పెట్టిన మెసేజ్ చూసి పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ‘కజ్జికాయల కేసు’ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మర్యాద విషయంలో అల్లుళ్ల పట్టింపులు ఏ రేంజ్లో ఉంటాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
