YS Sharmila Vs YS Jagan : రూ.1000 కోట్ల పని అడిగానని తనపై వైఎస్సార్ సీపీ తప్పుడు ప్రచారం చేయనుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. తనపై ఇలాంటి ఆరోపణలను చేసే వాళ్లంతా జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లేనని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్లంతా ముందుగా తమకు వైఎస్సార్ సీపీ పెద్దల నుంచి ఎంత అందాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కడప జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్మీట్లో వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వెయ్యి కోట్లు ఏంటి.. నేను 10 వేల కోట్ల వర్క్ అడిగానని కూడా వైఎస్సార్ సీపీ వాళ్లు చెప్తారు. వాస్తవానికి నేను వాళ్లను ఒక్క పైసా సహాయం కూడా అడగలేదు. ఆ ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్లిపోతా’’ అని ఆమె సవాల్ విసిరారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘వాళ్లు ఊసరవెల్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారు. తల్లి విజయమ్మపైనా నిందలు వేశారు. ఒక సారి ఆలోచన చేయండి’’ అని షర్మిల పేర్కొన్నారు. ‘‘ఇదే జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందన్నారు. జగన్(YS Sharmila Vs YS Jagan) సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారు. వివేకా హత్య తర్వాత జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణ అడిగారు. సీఎం అయ్యాక విచారణ వద్దు అన్నారు. అప్పుడొక మాట… ఇప్పుడొక మాట’’ అని ఆమె తెలిపారు.
‘‘వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టించారు. పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. అవినాష్ రెడ్డి నా భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ క్రూజర్లో వెళ్లి కలిశాడట. అవినాష్ రెడ్డి లాగా మధ్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదు. అనిల్ అలాంటి వాళ్లను కలవలేదు..ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అనిల్కు లేదు’’ అని షర్మిల చెప్పారు.