Site icon HashtagU Telugu

Chalapati Selfie With Wife : భార్యతో సెల్ఫీ దిగి చలపతి దొరికిపోయాడు.. మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంటర్‌కు కారణమదే

Maoist Chalapathi Encounter

Chalapathi Selfie With Wife : మావోయిస్టు అగ్రనేత చలపతి ఎన్‌కౌంటర్‌‌‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న లింక్ ఒకటి బయటికి  వచ్చింది.  2016 సంవత్సరం మే నెలలో ఏపీ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ సందర్భంగా మావోయిస్టులు పరారయ్యే క్రమంలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను అడవుల్లో వదిలారు. దానిలోని మొత్తాన్ని సమాచారాన్ని పోలీసులు శోధించారు. అయితే ఒక సెల్ఫీ ఫొటోను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు.. మావోయిస్టు అగ్రనేత చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి అని గుర్తించారు. చలపతితో పాటు భార్య అరుణ ఉన్నట్లు వెల్లడైంది. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి తలపై రూ.1 కోటి రివార్డు(Chalapati Selfie With Wife) ఉంది. దీంతో అతడి ఆచూకీని ట్రేస్ చేసే ప్రక్రియను పోలీసులు ముమ్మరం చేశారు. ఆ సెల్ఫీ ఫొటోను అప్పట్లో ఏపీ పోలీసులు మీడియాకు కూడా విడుదల చేశారు.

Also Read :Ayodhya Ram : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. దర్శన ముహూర్తం ఉంటుందా ?

చలపతి అలర్ట్ అయినా..

తన సెల్ఫీ ఫొటో పోలీసులకు దొరికిందని గ్రహించిన తర్వాత చలపతి కూడా అలర్ట్ అయ్యారు. తన వెంటనే మావోయిస్టుల టీమ్ సంఖ్యను పెంచుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందితో అడవుల్లో యాక్టివిటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. తన యాక్టివిటీని ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి ఛత్తీస్‌గఢ్-ఒడిశా బార్డర్‌కు మార్చుకున్నారు. దీనిపై పోలీసులకు పక్కా  సమాచారం అందింది. దీని ప్రకారమే ఛత్తీస్‌గఢ్-ఒడిశా బార్డర్‌లోని  గరియాబంద్ జిల్లాకు సమీపంలోని అడవుల్లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. సరైన సమయం కోసం ఎదురు చూశారు.

Also Read :MF Husain Paintings : ఎంఎఫ్ హుస్సేన్ రెండు పెయింటింగ్‌లు సీజ్.. వాటిలో ఏముందంటే..

1000 మందితో ముప్పేట దాడి

చలపతి  టీమ్ ఆ అడవుల్లోకి ప్రవేశించిందని తెలియగానే దాదాపు 1000 మంది భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి చలపతి టీమ్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చలపతితో పాటు మరో 13 మంది మావోయిస్టుల హతమయ్యారు. గరియాబంద్ జిల్లాలో జనవరి 20న మొదలైన ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం(ఇవాళ) మెయిన్ పూర్ పోలీసు స్టేషన్ ఏరియాలోని కుల్హాడీ ఘాట్ భాబాదిఘీ హిల్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతోందని గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేఛా తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆయన చెప్పారు.