Ration Card Service Charges : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించిన వివిధ సేవలకు చెల్లించాల్సిన రుసుములను ప్రభుత్వం భారీగా సవరించింది. గతంలో నామమాత్రంగా ఉన్న చార్జీలను ఇప్పుడు వందల శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, ఉన్న కార్డులో చిన్నపాటి మార్పులు చేయాలన్నా ఇకపై జేబుకు చిల్లు పడక తప్పదు. గతంలో కేవలం రూ. 24గా ఉన్న సాధారణ సేవా రుసుమును ఇప్పుడు ఏకంగా రూ. 100కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల మీ-సేవ లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సేవలు పొందే లబ్ధిదారులు అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది.
ఏ సేవకు ఎంత చెల్లించాలి?
ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. కొత్త కార్డు జారీ, డూప్లికేట్ కార్డు పొందడం, కార్డులో సభ్యుల పేర్ల చేర్పులు లేదా తొలగింపులు, చిరునామా మార్పు వంటి పనులన్నింటికీ రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటన్నింటికీ కేవలం రూ. 24 మాత్రమే వసూలు చేసేవారు. ఇక అత్యంత ముఖ్యమైన ‘కార్డు విభజన’ (Card Splitting) సేవ ధరను ఏకంగా రూ. 48 నుండి రూ. 200కి పెంచారు. అంటే పాత ధరతో పోలిస్తే ఇది సుమారు నాలుగు రెట్లు అధికం. కుటుంబ సభ్యులు విడిపోయినప్పుడు లేదా కొత్తగా పెళ్లైన వారు వేరుగా కార్డు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ భారం తప్పనిసరి అవుతుంది.
స్మార్ట్ కార్డుల పంపిణీ
ఇటీవలే కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ (QR Code) కలిగిన అత్యాధునిక స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్డుల నిర్వహణ, డేటా అప్డేషన్ మరియు సచివాలయ వ్యవస్థలో సాంకేతిక ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ ధరల పెంపు చేపట్టినట్లు సమాచారం. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా కార్డులు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, నిత్యం అవసరమయ్యే సవరణలు, మార్పుల కోసం సామాన్యులు చెల్లించాల్సిన మొత్తం పెరగడం పట్ల లబ్ధిదారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
