Site icon HashtagU Telugu

Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

Kurnool Bus Tragedy

Kurnool Bus Tragedy

కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తగలబడిపోతున్న బస్సులో ప్రయాణికులు అనుభవించిన బాధను తలచుకుంటుంటేనే ఏందో భయంకరంగా ఉందన్నారు. ”కర్నూలు ప్రమాద వార్త నా హృదయాన్ని తీవ్రంగా బాధపెడుతోంది. కాలిపోతున్న బస్సులో ఆ ప్రయాణికులు ఎలాంటి బాధను అనుభవించారనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలుతో సహా మొత్తం కుటుంబం నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతో కలచివేస్తోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రష్మిక మందన ఎక్స్ లో రాసుకొచ్చారు.

”కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దురదృష్టకర సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను తలచుకుంటే నా హృదయం బరువెక్కుతోంది. ఆ కుటుంబాలకి మరింత బలాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని కిరణ్‌ అబ్బవరం పోస్ట్ పెట్టారు.

”గత 2 వారాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తమ కుటుంబాలను చూడటానికి ప్రయాణిస్తున్నారు.. చనిపోడానికి కాదు. కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయడానికి సమయం ఆసన్నమైంది. సురక్షితమైన వైరింగ్, అత్యవసర ఎగ్జిట్స్ అవసరం. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాలు చాలు” అని సోనూసూద్‌ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో 400 మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ టీమ్ ప్రాథమికంగా గుర్తించాయి. బైక్ ని బస్సు ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ నుంచిపెట్రోల్‌ కారడం మొదలైందని, బస్సు కింద బైక్ కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగడం, క్యాబిన్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్లు ఒక్కసారిగా పేలడం, ఆ మంటలు ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. లగేజీ క్యాబిన్‌ పైన ఉన్న బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే సమయం లేకుండా పోయిందని, అందుకే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి.

Exit mobile version