తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), చంద్రబాబు, హీరో బాలక్రిష్ణ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ (NTR)శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ ముగ్గురు కలవబోతున్నారు. విజయవాడలోని అనుమోలు ఫంక్షన్ హాల్ వేదికగా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా రజనీకాంత్ హాజరు అవుతారని తెలుస్తోంది. అదే సందర్భంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు రాయభారాన్ని నడుపుతారని రాజకీయ వర్గాల్లోని టాక్.
గత ఏడాది చంద్రబాబునాయుడును, రజనీకాంత్ (Rajinikanth)కలిశారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య టీడీపీ, బీజేపీ పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిందని చర్చ నడిచింది. ఎందుకంటే, ఢిల్లీ బీజేపీ పెద్దలతో రజనీకాంత్ కు తత్సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ తోనూ బలమైన సంబంధం ఆయనకు ఉంది. సుదీర్ఘంగా చంద్రబాబుతో స్నేహం ఉంది. పలు సందర్భంగా ఏపీ, తమిళనాడు అంశాలపై రజనీకాంత్ జోక్యం చేసుకుని చంద్రబాబు ద్వారా సమస్యలను పరిష్కరించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు తరచూ రజనీకాంత్ కలిసేవారు. అటు బీజేపీ ఇటు టీడీపీ అగ్రనేతలతో స్నేహభావం కలిగిన రజనీకాంత్ పొత్తు అంశంపై దృష్టి పెడతారని భావించే వాళ్లు లేకపోలేదు.
రాజకీయాలకు దూరంగా రజనీకాంత్ (Rajinikanth)ఉంటారు. కానీ, ఆయన్ను రాజకీయాలు మాత్రం వదలడంలేదు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం రజనీకాంత్ మద్ధతు తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఒకానొక సందర్భంలో ఆయన కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ, ఆధ్యాత్మిక భావాలను పుష్కలంగా నింపుకున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే, కొత్త పార్టీ పెట్టే ఆలోచన నుంచి శాశ్వతంగా దూరం జరిగారు. అయినప్పటికీ సుదీర్ఘ పరిచయాలు ఆయన్ను రాజకీయాల వైపు అనివార్యంగా లాగేస్తున్నాయి. అలాంటి పరిణామం ఇప్పుడు విజయవాడ కేంద్రంగా చేసే అవకాశం లేకపోలేదు.
Also Read : TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
రాష్ట్ర వ్యాప్తంగా (NTR) శత జయంతి ఉత్సవాలు గత ఏడాది నుంచి జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈనెల 28న విజయవాడలోని పోరంకి వద్ద ఉన్న అనుమోలు గార్డెన్లో వేడుకల్ని నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ వేడుకలకు బాలక్రిష్ణ కూడా హాజరు కానున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, బాలక్రిష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఆ వేడుకలకు రజనీకాంత్ (Rajinikanth)కూడా రాబోతున్నారని తెలుస్తోంది. ఆ సందర్భంగా రాజకీయ అంశాల గురించి వచ్చే ప్రస్తావన మీద పలు విధాలుగా చర్చ జరుగుతోంది. తలైవా విజయవాడ వచ్చి వెళ్లిన తరువాత టీడీపీ, బీజేపీ పొత్తుకు ఒక క్లారిటీ రానుందని పలువురు భావిస్తున్నారు. ఎంత వరకు రజనీకాంత్ రాజకీయాలపై రియాక్ట్ అవుతారు? అనేది చూడాలి.