పార్ల‌మెంట్ కీల‌క అంశాల‌ను లేవ‌నెత్త‌నున్న వైసీపీ ఎంపీలు…?

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్ల‌మెంట్ లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ఎంపీల‌తో సమావేశం నిర్వ‌హించారు.

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 03:32 PM IST

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్ల‌మెంట్ లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ఎంపీల‌తో సమావేశం నిర్వ‌హించారు.స‌మావేశాల్లో ప‌లు కీల‌క అంశాల‌నే లేవ‌నెత్తాల‌ని ఆయ‌న సూచించారు.ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్ని రూ.55,657 కోట్ల‌కు పెంచి కేంద్రం ఆమోదం పోందేలా చూడాల‌ని ఏంపీల‌కు తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,104 కోట్లు ఖర్చు చేసిందని…కేంద్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని సీఎం జ‌గ‌న్ తెలిపారు. విద్యుత్, సాగునీరు స‌మ‌స్య‌ల‌పై ఎంపీలు దృష్టి సారించాలని.. ఇటీవల జరిగిన స‌ద‌ర‌న్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన ఆరు ప్రధాన అంశాలను ఉభయ సభల్లో లేవనెత్తాలని జ‌గ‌న్ సూచించారు.

ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కేంద్రం రూ.1,703 కోట్లు, ఉపాధి హామీ పథకం అమలు కోసం మరో రూ.4,976.51 కోట్లు బకాయిపడిందని సీఎం జగన్ ఎంపీలకు గుర్తు చేశారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యుత్‌ను వినియోగించుకుందని… రాష్ట్రానికి 6,112 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ అంశంపై ఒత్తిడి తెచ్చి, ఆ సొమ్ముకు కేంద్రం ఆమోదం తెలిపేలా కృషి చేయాల‌ని ఎంపీలను కోరారు

విభజన సమయంలో రాష్ట్రానికి రిసోర్స్ గ్యాప్ నిధులు రూ.22,948 కోట్లు ఉండగా… కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తాలని…ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ఆమోదం పొందాలని ఆయన కోరారు. కాగ్ నివేదిక ప్రకారం…దాదాపు రూ.16,078.76 కోట్లు కాగా… ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు కలిపితే అది రూ.22,948.76 కోట్లు అవుతుందని సీఎం జ‌గ‌న్ ఎంపీల‌కు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. తక్షణ సాయంగా రూ. 1,000 కోట్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.