అగ్నిపథ్ కుట్రదారులు భరతం పట్టడానికి కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐటీ), ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు సోమవారం ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోదాలు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసరావుపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగాయని నిఘా సంస్థల అనుమానం. సాయి డిఫెన్స్ అకాడెమీ అధినేత ఆవుల సుబ్బారావు పై ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న ఐబీ అధికారులు నరసరావుపేటకు చేరుకున్నారు. ఐటీ అధికారులతో కలిసి పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వారు వెళ్లారు. సాయి డిఫెన్స్ అకాడెమీలో రికార్డులను ఐబీ, ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అకాడమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడి సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.