AP Weather: ఏపీ ప్రజలు అలర్ట్.. రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి

  • Written By:
  • Updated On - April 9, 2024 / 10:25 AM IST

AP Weather: మంగళవారం 39 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా హిరామండలంలో తీవ్ర వడగాల్పులు , 65 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు శ్రీకాకుళం13, విజయనగరం12, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

సోమవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 44.4°C, వైయస్సార్ జిల్లా వెడురూరులో 44.3°C, కర్నూలు జిల్లా వగరూరులో 43.8°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2°C, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43.1°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే అన్నమయ్య జిల్లా పెదతిప్పసముద్రం మండలంలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల 36 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.