Pawan Kalyan: మంగళవారం అనంతపురం జిల్లాలో ‘పవన్’ పర్యటన

కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు.

  • Written By:
  • Updated On - April 12, 2022 / 12:59 AM IST

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 12వ తేదీ ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేస్తారు. ఉదయం 10:30 కు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు. 11:20 గం. కు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు.

అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్ధిక సాయం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12: 10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రిందట ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే గ్రామసభ(రచ్చబండ) కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామ సభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు పవన్ కళ్యాణ్.