Nara Lokesh : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? అసలు మా పార్టీ అకౌంట్ లోకి డబ్బు వచ్చిందని మీరు నిరూపించగలిగారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర పున:ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. యువగళం పాదయాత్రను తిరిగి ఇవాళ్టి నుంచి లోకేష్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి తన యువగళం పాదయాత్రను ప్రారంభించారు.
ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారు. నాపై ఆరు కేసులు పెట్టారు. అయినా మేము ఏమాత్రం వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మీలాగ మేము చేస్తే ఒక్క వైసీపీ నేత కూడా బయట ఉండడు. అందరూ జైలుకి వెళ్తారు. వడ్డీతో సహా అధికారంలోకి రాగానే చెల్లిస్తాం. ఆ బాధ్యత నేనే తీసుకుంటా అని నారా లోకేష్ మండిపడ్డారు.